Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 3

వాస్తు పుట్టుక 

వాస్తు శాస్త్రం ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు గ్రంథస్థం చేయబడిందో తెలుసుకోవటానికి కొంత చారిత్రిక పరిశోధన చేయాలి. అయితే రావిపూడి గారు వాస్తు గ్రంథాలన్నీ 10 శాతాబ్దం తరువాతే వచ్చాయనే తలంపుతో వాస్తు 'ఆర్య వాస్తువా?' అంటూ అహేతుక వాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
ఆర్యులు నివసించిన గంగానది దక్షిణ తీర మైదానంలో (ఆర్యావర్తనం) భూమి ఏటవాలు తూర్పు మరియు ఉత్తర దిశలకూ ఉంది కాబట్టి వర్షపు నీరు, వాడుక నీరు సులభంగా పోవటానికి భూ ఉపరితల నీటి వాలు తూర్పు పడమరలకు ఉండాలనే సూత్రం ఏర్పడి ఉండవచ్చు అనే నా యుక్తీకరణకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆనాడు నివాస ప్రదేశం వరద ముంపుకు లోనుకాకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భూ ఉపరితల వాలుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి వరదలకు, భారీ వర్షాలకు అనేక జనావాసాలు ముంపుకు గురిఅవుతున్న విషయం గమనించే ఉంటారు. 
క్రీస్తు పూర్వం 1000-1500 సంవత్సరాల మధ్యలో గంగాతీరంలో ఆర్యులు జీవించారని, గుడిసెల్లో గుడారాలల్లో తిరిగిన ఈ దేశదిమ్మెరలకు వాస్తు శాస్త్రం తెలియదని, ఆతరువాత కీ.శ 5 శతాబ్దిలో నాటి జ్యోతిష్య, ఖగోళ గ్రంథాలైన కాలామృతం, బృహత్సంహితాదులలో వాస్తు ఉందన్నారు. ఈ వాస్తువు లిఖించిన కాలం నాటికి ఆర్యులు గంగానది తీరంలోనే నివసిస్తున్నారా? లేక కాళిదాసు, వరాహమిహిరుడు కూడా గంగా తీర వాసులేనా? అంటూ వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఆయా గ్రంథాలలోనే లభిస్తాయి. 
కాలామృతం మీరు భావిస్తున్నట్లు మహాకవి కాళిదాసు రాయలేదు. పూర్వ కాలామృతం పేరుతో అది గోదావరి తీరం రాజమహేంద్రవరంలో  ఒకటి  (ఋషి ప్రోక్తం,రచయత లేడు), మరొకటి తిరుపతి ప్రాంత వాసిగా భావిస్తున్న కాళిదాసు అనే పండితుడు రాసిన ఉత్తర కాలామృతం పేరుతో ఉన్న జ్యోతిష్య గ్రంథం. దీనిలో అసలు వాస్తు ప్రస్తావనలు లేవు. ఇవి రెండు తొలి నాటి వాస్తు పుస్తకాలు కావు. వీటి రచనా కాలం 16వ లేక 17వ శతాబ్దిలో కానీ అయిఉండొచ్చు. పొరపాటును గ్రహించటం విజ్ఞనుల లక్షణం కదా!  
ఇకపోతే 5వ శతాబ్దిలో వరాహమిహిరునిచే లిఖితమైన బృహత్సంహితలో "వాస్తు విద్య" పేరుతో వాస్తువు గురించి చెప్పారు. (దీనిని తెలుగులోకి అనువదిస్తూ నేను రాసిన విశ్లేషణాత్మక విపుల వ్యాఖ్యానంతో 'వాస్తు విద్య' అనే గ్రంథంగా ప్రచురించబడింది. పూర్తి పాఠం దానిలో చూడగలరు). 

ఉజ్జెయిని రాజధానిగా పరిపాలించిన రెండవ విక్రమాదిత్య ఆస్థాన పండితులలో (నవ రత్నాలు) ఒకరైనా వరాహమిహిరుడు నర్మదా తీరవాసి. వీరు రాసిన వాస్తు విషయాలు బ్రహ్మప్రోక్తం అంటూ పూర్వికులైన  గార్గుడు, వశిష్ఠుడు, మయుడు, విశ్వకర్మ, నగ్నజిత్తు మొదలగు వారి పేర్లను సందర్బోచితంగా చెపుతాడు. అలాగే కీ.పూ. 300 నాటి వాడైన చాణక్యుని అర్ద శాస్త్రం లో కూడా వాస్తు విషయాలు ఉన్నాయి. అంటే ఆ కాలానికే ప్రాధమిక వాస్తు సూత్రాలు రుపొందాయన్నది నిర్వివాదాంశం. 
మీరు అన్నట్లు ఆర్యులు దేశ దిమ్మేరులు కాబట్టే వారికి భూ వాలు తలం గురించిన అవగాహన వచ్చింది. వారి జీవన విధానంలో నివాస ప్రదేశం ముఖ్యం. సురక్షితమైన ప్రదేశం, వారి పశువులకు ఆహారం పుష్కలంగా లభించే ప్రదేశాలను మాత్రమే ఎన్నుకునేవారు. అనుభవాల నుండి సూత్రాలు ఏర్పడటంతో వింతేముంది? అలాగే వాస్తుకు సంబంధించిన జ్ఞానం వీరు సింధునాగరిక సమాజం నుండి కూడా సంక్రమించి ఉండవచ్చు అనే ఒక వాదం కూడా బలంగా ఉంది. 
ఇలా తొలి వాస్తు ప్రతిపాదనలు ఆర్యులనుండి వచ్చాయి చెప్పటానికి మరొక కారణం మనకు వాస్తు పద విన్యాసం లో కన్పిస్తుంది. ఈ వాస్తు పద మండలంలో చెప్పబడిన 54 మంది దేవతలు ఋగ్వేద కాలంలో పూజలందుకున్నవారే. వేదాలు, పురాణాల లాగే వాస్తు కూడా మౌఖికంగా మొదలై 4వ శతాబ్దిలో గ్రంధస్తం చేయబడి ఉండొచ్చు. నాలుగో శతాబ్దంలో రాయబడిన ఆరు పురాణాల్లో వాస్తు ఒక ప్రధాన అంశంగా చెప్పారు. చిత్రమేమంటే పురాణాల్లో ఉన్న దేవతలు కానీ, దేవుళ్ళు కానీ వాస్తులోకి ప్రవేశించలేదు. మహాఋషి ప్రోక్తంగా పాత దేవతలతో ఇవి అవిచ్ఛన్నంగా  కొనసాగుతూ వచ్చాయి. 
రావిపూడి గారు అంతకు ముందు తాను వెతిరేకించిన ఆర్యవాస్తువు అనే  వాదాన్ని ఉత్తర పక్షం చేస్తూ 'వాస్తు గ్రంథాలు వెలువడేనాటికి ఆర్యులు దేశమంతటా వ్యాపించారని, వారి సర్వాధికారాన్ని ఆనాటి సమాజంలో వ్యాప్తి చేశారని' చెప్పారు. అంటే మీరు చెప్పిన ఆర్యుల సర్వాధికారాల్లో  'వాస్తువు' మాత్రం లేదని మేము అర్ధం చేసుకోలా ?
అలాగే 'వాస్తు సూత్రాలు ఏర్పడిన కాలంలో దేశంలో జనాభా చాలా తక్కువ అని ఎక్కడ చూసినా కావలిసినంత మెల్లా (స్థలం) ఉందని, అలాంటి స్థితిలో స్థలాల ఆకారాలతో, నీటివాలు పేరుతో పిచ్చపిచ్చగా గృహనిర్మాణ వాస్తు సూత్రాలను రుద్దవలసిన అవసరం లేదనే' రావిపూడి గారి వాదనలో సహేతుకత కానరాదు. ఎందుకంటే ఆనాడు జనాభా తక్కువే కానీ నివాసయోగ్య ప్రదేశాల లభ్యత తక్కువ. ఎటు చూసినా దట్టమైన అడవులు. వ్యవసాయానికి  అనుకూలంగా సాగుచేసిన భూమి లభ్యత కూడా తక్కువే. నగరాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా అడవులను నరికి సురక్షితమైన కొత్త జనావాసాలు రాజులే నిర్మించి ప్రజలకు ఇచ్చేవారు. అలా ఏర్పడినవే నేడు ఉన్న చాలా గ్రామాలు, పట్టణాలు, నగరాలు. వీటి నిర్మాణం కొరకే వాస్తు సూత్రాలు రూపొందాయి. ఈ సంగతి బహుగ్రంథకర్త అయిన రావిపూడి గారికి తెలియదా లేక తెలిసే ఎందుకు ఈ బండ, మొండి వాదనకు బీజం వేసారో వారే వివరణ ఇవ్వాలి.  
వాస్తులో చెప్పిన ఎత్తు పల్లాలు మొత్తం జనావాసాలకు సంబందించినవా లేక ఇంటి స్థలాలకు సంబంధించినవా అనే విషయంలో వాస్తు చెప్పేవారికి ఎటూ అవగాహన లేదు సరే, ఇదే విషయంలో హేతువాదులు కూడా గందరగోళంలో పడితే ఎలా? విషయ సంగ్రహణ కాకుండా ఫలితాలు చుట్టూ ఆలోచనలన్నీ పరిభ్రమిస్తుంటే ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. 
రావిపూడి గారు భావిస్తున్నట్లు 'నిజానికి జ్యోతిష్కులూ, వాస్తు పండితులు చెప్పేవి ఫలితాలే. ఆ ఫలాలు జారుతాయని చెప్పి బెదించటమే వారి వృత్తికాని జ్యోతిర్వాస్తులు శాస్త్రాలని రుజువు చేయవలిసిన అవసరం వారికి లేదు. వారికి ఖాతాదారులు కొరవైతే కదా?' అభ్యుదయ వాదులందరితో పాటు నా అభిప్రాయం కూడా ఇదే. చిత్రమేమంటే చాప కింద నీరులా నేడు వాస్తు ఫలితాలు మతాతీతంగా సమాజంలో విస్తరిస్తున్నాయి.     
ఫలితాలు చెప్పి పబ్బం గడుకునే వాస్తు కుక్షింభరులతో జరిపే వాద ప్రతివాదాలవల్ల కాలయాపన తప్పా వనగూడే ప్రయోజనం శూన్యం. వాస్తుని నమ్మేవారికి వాస్తు పై అవగాహన కల్పించాలనే  కోణంలో నా రచన కొనసాగింది.  (సశేషం)
ఆచార్య కొడాలి శ్రీనివాస్.

Comments

Popular posts from this blog

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక  తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన  బృహత్సంహిత  లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది  .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో  ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా  గ్రంధం -   1997 లేని విషయాన్ని చెప్పటాన్ని  అబద్ధం   అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి   అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని  అవగాహనారాహిత్యం  అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాల

చౌదరి - చరిత్ర

ఈనాడు తెలుగునాట కమ్మవారి గౌరవ కుల చిహ్నం గా ప్రాచుర్యంలోకి వచ్చిన చౌదరి అనే పద ఆవిర్భావం గురించిన విషయాలలో లోతైన పరిశీలన చేయాలిసిన అవసరం ఏర్పడింది. చౌదరి అనే గౌరవ పదాన్ని అగౌరవంగా కమ్మకుల పెద్దల పేర్లకు అతికించే లేకిబుద్ది నాయకులకు సమాధానం చెప్పాలి.  నిజానికి 'చౌదరి' కులనామం కాదు. అది ఒక పదవి. చౌదరి అనే పదం 'చౌత్ - అరి' అనే రెండు పదాల కలియక. చౌత్ అంటే ఫలసాయంలో నాలుగోవంతు అని , అరి అంటే పన్ను(శిస్తు) అని అర్ధం. కాబట్టి చౌదరి అంటే ఫలసాయంలో నాలుగో భాగం పన్నుగా వసూలు చేసే అధికారి. ఈ అర్ద వివరణపై విమర్శలు కూడా ఉన్నాయి.  ఫల సాయంలో ఆరోవంతుకు మించి పన్ను వసూలు చేయటం తప్పు అని చెప్పిన విషయం కొన్ని ధర్మశాస్త్రాలలో ఉన్నమాట నిజమే. కానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో నదులు, చెరువులు, నూతులు వంటి వాటినుండి నీరు తీసుకొని పండించే పంటలో నాలుగోవంతు రాజుగారికి పన్నుగా చెల్లించాలని స్పష్టంగా చెప్పబడినది. కాబట్టి నాలుగోవంతు పన్ను వసూలు చేయటంలో అనౌచిత్యం ఏమిలేదు. చరిత్రను పరిశీలించితే ప్రభువులను బట్టి, వారి అవసరాలను బట్టి ప్రజలనుండి వసూలు చేసే పన్నులలో హెచ్చు తగ్గులు ఉండటం కనిపిస్తుంది.  చరిత్ర 

వీధి ఆలయాలు - అపోహలు

వాస్తు శాస్త్రం అంటే ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం మని, ఇది వివిధ నిర్మాణాల రూపకల్పనలో కీలక పాత్ర నిర్వర్తించిందన్న విషయం నిర్వవాదాంశం. దీనిలో మానవ నివాసాలకు, దేవతల నివాసాలకు (దేవాలయాలు) వేరువేరుగా నిర్మాణ సూత్రాలను రూపొందించారు. సామాన్య నివాసాలలో కనిపించని శిల్ప, చిత్రకళలు ఈ దేవాలయాల నిర్మాణాలలో జోడించడం వల్ల దేవాలయ వాస్తు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. సామాజిక సంస్కృత మత చిహ్నంగా భాసిల్లే ఈ ఆలయాలను ఆనాటి పాలకులు తమ రాచరిక వైభవాన్ని చాటుకునేలా, వారి పేరు పదికాలాల పాటు నిలిచుండేలా దేవాలయాలను దృఢంగా, ఘనంగా నిర్మించేవారు.  ఆలయాలను సుందరమైన నదీ తీరాల్లో (తీర్థస్థలాలు), కొండకోనలలో, వనాలలో మరియు గ్రామ, పట్టణ, నగరాల్లో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో మాత్రమే నిర్మించాలని చెప్పబడినది. ఆలయాలను ఎవరి ఇష్టారీతిని వారు ఎక్కడపడితే అక్కడ నిర్మించరాదు. స్థల పురాణం పేరుతో ప్రతి ప్రముఖ ఆలయానికి ఒక చరిత్ర ఉంది.  కొందరు బతుకుతెరువు కొరకు బజార్లవెంట కట్టుకున్న గుడులకు, మందిరాలకు ఎటువంటి ప్రాముఖ్యత గాని, ప్రాశస్త్యం గాని, చరిత్ర కానీ లేదు. రోడ్ల విస్తరణలో వీటిని నిరభ్యంతరంగా తొలగించవచ్చు. వీటికోసం వీధి పోరాటాలకు ది