ఏదైనా ఒక విషయం పై మనస్సులో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడితే దానికి గురించిన విషయ పరిశీలనలో మరొకరి అభిప్రాయాలను పట్టించుకోరు. ఇలాంటి వారు తాము పట్టిన కుందేటికి మూడేకాళ్లు అంటూ ముందుగా ఏర్పరుచుకున్న ఇనుప చట్రం లో దాన్ని బిగించి గిరగిరా తిప్పి చాకిరేవులో ఉతికి ఆరవేయటం నైజం. నిక్షపాక్షిక పరిశీలన లోపిస్తే నిజాలు మరుగున పడతాయి. ఇది రావిపూడి వారి వాస్తువు శాస్త్రమా? లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
భూతాలు - దిక్కులు
వాస్తును అర్ధం చేసుకోవటానికి పాఠకులకు దానిలో ఉన్న పదాలను ముందుగా పరిచయం చేయటం పరిశోధనా గ్రంథాలలో తప్పని సరి అంశం. వాస్తువు గ్రంథ రూపంలో వచ్చేటప్పటికి (క్రీ.శ. 4-5 శతాబ్దాలు) పంచ భూతాలు మాత్రమే వారికి తెలుసు. చార్వాకులు నాలుగు భూతాలు అన్నారు, ఆధునిక విజ్ఞానం ప్రకారం ఇవి ఏవి మూలకాలు కాదని చెప్పారని అంటూ రావిపూడి వారు అసలు విషయాన్ని ప్రక్కకు తీసుకువెళ్లడం వారి అసహనాన్ని మాత్రమే తెల్పుతుంది. అలాగే దిక్కులు, దిక్పాలకుల గురించి. ఆనాటి వారికి ఒక ప్రదేశాన్ని నాలుగు ప్రధాన దిక్కులతో నాలుగు విదిక్కులతో విభజించటమే తెలుసు. భూమిని 360 డిగ్రీల కోణంలో, ఒకడిగ్రీ మరల 60 నిమిషాలుగా, ఒక నిమిషం 60 సెకండ్లగా విభాగించే జ్ఞానం అప్పట్లో లేదు. ఇంత చిన్న విషయానికి దిక్కులు ఎనిమిదే ఎందుకుండాలి ఇంకా ఎక్కువ ఎందుకుండరాదో అని అడగటంలో అర్ధం లేదు. మీరు అన్నట్లు రోదసీలోకి పోతే దిక్కులే ఉండవు. దిక్కులే లేకపోతే గోళాకారపు భూమికి వాస్తు ఎలా వర్తిస్తుంది అనేది కేవలం వితండ వాదన. నేల విడిచి సాము చేయటం లాంటిది. ఎందుకంటే వాస్తులో చెప్పబడిన దిక్కులు భూమిపై ఉన్న ప్రదేశానికి సంభంధించినివి కదా! ఒక ప్రదేశానికి ముందు-వెనుకలు, కుడి - ఎడమలు చెప్పటానికి వారికి దిశలు ఉపయోగపడటం తప్పు ఎలా అవుతుంది. అవి లేకుండా ప్రదేశం యొక్క స్థితిగతులు సులభంగా చెప్పలేము.
ఒక ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించటానికి దిశలు ప్రాధాన్యం వహిస్తాయనేది నిర్వవాదాంశం. కచ్చితమైన తూర్పు దిశను లేదా ఉత్తర దిశను భూమిపై గుర్తించే పద్దతి దిక్సాధన పేరుతో ఆనాటి వాస్తు గ్రంధాలలో లిఖితమై ఉంది. వాటిని బట్టి ప్రణాళికా బద్ధంగా గ్రామ, నగర, పట్టణ, ఆలయాల నిర్మాణాలు చేశారు. అనేక రకాల గ్రామ, నగర ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. ఆనాటి వారు తూర్పు దిశను ప్రధానంగా చేసుకొని సవ్య దిశలో (clockwise) ప్రణాళికలు చేసుకున్నారు. ప్రణాళికలో వాళ్ళు అన్ని దిశలకూ సమాన విలువ ఇచ్చారు. మీరు అన్నట్లు దిశలలో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ కాదు. కానీ సూర్యోదయం బట్టి తూర్పుకు, సూర్యగమనం (ఉత్తరాయణం) బట్టి ఉత్తరానికి మతాచారాల కారణముగా కాస్త ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. రావిపూడి గారు ఓనన్నా కాదన్నా ప్రతి దిశకు ప్రకృతి సిద్ధంగా ఒక నిర్దిష్టమైన స్థానం ఉంటుంది. మానవుని సహజ ఇంగితజ్ఞానం ప్రకృతికి అనుగుణంగానే పయనిస్తుంది. ప్రకృతిని ఆరాధించే క్రమంలో పురుడు పోసుకున్నవే ఈ దిక్పాలకులు. ఆదిమ మానవుల ఊహల్లో పుట్టిన ఈ దిక్పాలకులు తమ దైవిక శక్తితో మన జీవితాలను శాసిస్తారని తలచటం అవివేకం. దిశల వెనుక దాగిన మౌఢ్యాన్ని కేవలం గుర్తిస్తే చాలదు. అది మౌఢ్యం అయినప్పటికీ ఇంకా వాస్తురూపంలో (సమాజంలో) ఎందుకు నిలిచిపోయిందో వివరించగలగాలి. అప్పుడే వీటి నుండి విముక్తి లభిస్తుంది. అదే నా ప్రయత్నం.
వాస్తుపద మండలం
నా రచనలో ఇవన్నీ ఎందుకు ప్రస్తావించానంటే నిజంగా వాస్తులో ఏముందో తీసుకోవాలనుకునే జిజ్ఞాసులకు నా పరిశోధనాంశాలు తెలియజేయాలనే ఉద్దేశమే కానీ వాస్తుబలాలు/ఫలాలు చెప్పటానికి కాదు.
వాస్తులో ప్రస్తావించిన ఋగ్వేద కాలంనాటి ముక్కు మొఖం తెలియని దేవతలకు (వాస్తుపద దేవతలు 45 మంది, బాహ్యపద దేవతలు 8 మందితో పాటు వాస్తు పురుషుడు కలిసి మొత్తం 54 మంది) మహిమలు ఆపాదిస్తూ, వాస్తు సూత్రాల అనుగుణంగా కట్టడాలు కట్టిన సుఖసౌఖ్యాలు, కట్టనందువల్ల కష్టనష్టాలు వస్తాయనేది ఫలిత వాస్తుగా చెప్పుతూ వచ్చారు.
ఇలా ఉద్బవించిన వాస్తు ఫలితాలు తప్పు అని అవి జరగవని ప్రయోగాత్మకంగా రుజువు చేయమని రోజూ కుహనా సిద్ధాంతులను అడగవలిసిన అగత్యం లేదు. ఇలాంటి విశ్వాసాలు వాస్తు శాస్త్రంలో ఎందుకు పుట్టాయో, వాటి వెనుకనున్న మర్మమేమిటో అర్ధం చేసుకోగలిగితే వాటిపై ఉన్న విశ్వాసానికి పునాది లేకుండా పోతుంది. ఇది ఒక్క వాస్తు విశ్వాసాలకు మాత్రమే పరిమితం కాదు ఇలాంటి మూఢవిస్వాశాలన్నిటికి వర్తిస్తుంది. (సశేషం)
ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments