రాయల సీమ రాజకీయం
నిజం చెప్పులు తొడుగుకొని బయటికి వచ్చేసరికే అబద్దం ఆరు సార్లు ఊరంతా తిరిగి వస్తుందనేది జగమెరిగిన నానుడి. అమరావతి పై అసూయతో రాజకీయ లబ్దికొరకు కొందరు అదేపనిగా అనేక అబాండాలు, అవాస్తవాలను ప్రచారంలోకి తెచ్చారు.
కావలి కాసే కుక్కను చంపాలనుకొనే వారు దానికి పిచ్చి అని చెప్పి తలొక రాయి వేసినట్లు అమరావతిని భ్రమరావతిగా ప్రచారం చేశారు. ఇక్కడ కుల పిచ్చి ఉందని నిజానిజాలు నిర్దారణ జరగకుండానే తీర్పులు చెప్పటం విచారకరం.
ఇలా కొంతమంది రాయలసీమ పెత్తందారులు కోస్తా ఆంధ్రపై ముఖ్యంగా ఈ అమరావతి కృష్ణ తీరప్రాంతంపై విషం చిమ్మటం గత 90 సంవత్సరాలనుండి గమనిస్తున్నదే. 1926 లో విజయవాడలో నెలకొల్పిన ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని తమ ప్రాంతంలో పెట్టలేదనే అక్కసుతో విశాఖపట్నం తరలించటం లో సీమకు చెందిన మేధావి సి.ఆర్ రెడ్డి పాత్ర అనితరసాధ్యం. ఆంధ్రతో కలిసి ఉండటానికి శ్రీ బాగ్ ఒప్పందం పేరుతో పదవుల కొరకు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వారి మద్య ఒక చట్టబద్దత లేని ఒప్పందం కుదుర్చికొని విజయవాడలో ఉండాలిసిన రాజధానిని కర్నూలుకు తీసుకుపోయారు. మరల వారి స్వలాభం చూసుకొని హైదరాబాదుతో ఒప్పందం చేసుకొని రాజధానిని మారుస్తూ, హైకోర్టు గుంటూరు నుండి హైదరాబాదుకు తరాలించారు.
పంట పొలాలు పరిశ్రమలకు పనికిరావని, వాళ్ళ తిండికి లోటు వస్తుందని ఏ ఒక్క పరిశ్రమను ఈ ప్రాంతానికి దక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఇక్కడ కూడా అనేక మెట్ట ప్రాంతాల ఉన్నా కూడా పరిశ్రమలు కోస్తావాసులకు దక్కకుండా చేశారు. వెనకబడ్డ ప్రాంతం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇక్కడ సంపదను, విద్య సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను, సాగునీటిని రాయసీమకు వారి వాటాకు మించి తీసుకుపోయారు.
నాగార్జున సాగర్ కు అడ్డుపడి శ్రీశైలం డామ్ కట్టి జలదోపిడికి నాంది పలికింది రాయసీమకు చెందిన నీలం సంజీవ రెడ్డి. నూతన రాష్ట్రం లో ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన రాజధానిని అమరావతిలో వచ్చినందుకు సంతోషించారు. ఇప్పుడు అమరావతి లో రాజధాని లేకుండా చేయటానికి మరల సీమ పెత్తందారుల ప్రతినిధిగా జగన్ మోహన్ రెడ్డి కుట్రకు తెరలేపాడు. కులాల కుంపటిలో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టే వికృత విభజన రాజకీయ క్రీడకు తెరలేపారు. సామరస్యంగా పరిష్కరించబడిన రాజధాని సమస్యను తిరిగి తెరపైకి తెచ్చి విశాఖలో దోపిడీకి దారులు వేస్తున్నారు.
అమరావతిలో నిర్మించే ప్రజారాజధాని ఒక్క కమ్మ సామాజిక వర్గానికే ప్రయోజనం చేకురుచ్చుతుందనేది పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ఉన్న జనాభాలో దాదాపు 75% మంది ఎస్సీలు, యాదవ, ఇతర బిసిలు, ముస్లిం మైనారిటి ప్రజలే. మిగిలిన 25% లో కమ్మవారు, రెడ్లు, కాపులు ఈ మూడు కులాలవారు సమానంగా ఉన్నారు. వీరితోపాటు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఉన్నారు. రాజధాని పరిసరాలలో ఉన్న ఎనిమిది శాసన సభ స్థానాలలో తాడికొండ, పత్తిపాడు లో ఎస్సీ కులాలు, గుంటూరు-1, విజయవాడ-1 ముస్లింలకు, వైశ్యులకు మంగళగిరి బిసిలకు,రెడ్లకు ప్రాతినిధ్యం ఉంటుంది. విజయవాడ-2 బ్రాహ్మణ, కాపు కులాలు, గుంటూరు-2 వైశ్య, కాపు, రెడ్డి కులాలకు, విజయవాడ -3, తెనాలి కమ్మవారికి అధిక ప్రాతినిధ్యం ఉంటుంది. అన్ని కులాల మిశ్రమంతో ఉన్న కాస్మోపాలిటన్ సిటి అమరావతి. అలాంటిది దీనిపై ఒక కులం ముద్ర వేయడం దుష్ప్రచారమే.
అమరావతి ప్రాంతం ప్రగతిశీల అభ్యుదయ వాదులకు అడ్డా. సాంఘిక, సాహిత్య సారస్వత సమాజం. కళాకారులకు పుట్టినిల్లు. అతివాద- మితవాద - తీవ్రవాదాలకు, నాస్తిక, ఆస్తిక భావజాల వేదిక. గాంధేయ వాదులు, మార్క్స్ వాదులు కలసి మెలిసి నడయాడిన నెల ఇది. సాంఘిక దురాచారాలను కాలరాసి, మనువాదాన్ని తృణీకరించి స్వకుల పురోహిత్యాన్ని ప్రోత్సహించి, అంటరానితనాన్ని నిరసించి హేతువాదాలకు పట్టం కట్టిన ఆదర్శ భూమి. ఎందరో దాన శీలులు, స్వాతంత్ర సమర యోధులు, త్యాగ ధనులు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ప్రజ్ఞావంతులు నివసించిన అమరావతిని హస్వ దృష్టితో నిందించటం, ఆకాశానిపై ఉమ్మివేయటం రెండు నీతి లేని పనులే.
ఈ రాజకీయ విన్యాసాలకు ఇక్కడ తల్లి పాలు, నీళ్లు త్రాగిన కొంత మంది హీనులు చిందులు వేయటం సిగ్గు చేటు. అమరావతి కేద్రంగా జరుగుతున్న ఈ కుట్రను బహిర్గతం చేయాలి. అనాదిగా కలిసిమెలిసి ఉన్న ఉత్తరాంధ్ర ,కోస్తా ఆంధ్రావాసుల మధ్య చిచ్చు పెట్టె చర్యలను తీవ్రంగా వెతిరేకిద్దాం. విశాఖపట్నం మన నవ్యఆంధ్ర ఆర్ధిక రాజధానిగా తీర్చుదిద్దుకుందాం. కబ్జా చేసే రాబందులనుండి విశాఖను, అమరావతిని కాపాడుకుందాం.
ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments