ఆవేశం ఆలోచనను అణిచివేస్తుంది. అభిమాన దురాభిమానాలు వివేకాన్ని, విచక్షణను పోగొడతాయి. కక్షలు,కార్పణ్యాలు జాతిని దహించివేస్తాయి. ఈర్షా ద్వేషాలు, పగ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారతాయి. అనుమానాలు, అపనమ్మకాలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తాయి. వ్యక్తిగతంగానే కాక సామాజకపరంగాకూడా వీటిని దరిచేయకుండా విజ్ఞతను చూపాలి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పురుడు పోసుకుంటున్న క్రమంలోవస్తున్న సంకుచిత వాదనలలో ఇటువంటి పోకడలే కనిపిస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుందాం.
1. కర్నూలు లో హైకోర్టు
2. ప్రాంతీయ అసమానతలు - సీమ వాదనలు
మన రాష్త్ర భౌగోళిక పరిస్థితులను బట్టి కోస్తా ఆంధ్రా కంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలో కొంత భాగం అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయనుటలో సందేహం లేదు. తీవ్ర వర్షాభావం, నీటి ఎద్దడి, వర్గ కలహాలు రాయలసీమను కృంగదీస్తే, అవిద్య,పేదరికం ఉత్తరాంధ్ర వెనుకబడటానికి హేతువులగా కనిపిస్తున్నాయి.
విద్యాపరంగా పరిశీలించితే విద్యాసంస్థలలో సింహ భాగం రాయల సీమ నాలుగు జిల్లాల లోనే ఉన్నాయన్నది నిజం. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అపార ఖనిజ నిక్షేపాలు, సారవంతమైన భూములు ఉండికూడా సీమ వెనక బడటానికి కారణాలు అన్వేషించాల్సిన ఆవశ్యకత ఉంది. రోగం ఒకటి అయితే మందు ఇంకోటి అన్న చందాన రాయలసీమలో రాజకీయ క్రీడ నడుస్తున్నది.
కోస్తా ప్రాంతంలో ఉన్న విద్య,ఆర్థిక,రాజకీయ,సామాజిక సమతుల్యత సీమలో లోపించిందన్నది కఠోర వాస్తవం. ఈ ప్రాంతం పాలెగాళ్ళ పాలన నుండి నయా రాజకీయ పెత్తందారీ వ్యవస్థలోకి మారిందే కానీ ప్రగతి పథంలోకి పయనించలేదు.
తొలినుండి విద్య,ఉద్యోగ విషయాలలో దామాషాపద్ధతిలో వారికి సమాన అవకాశాలు లభించాయి. రాష్ట్ర రెవిన్యూలో వారి వాటాకు మించి అనుభవిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా కీలక పదవులలో ఆ ప్రాంతం వారే ఎక్కువ కాలం పాలించారు. అయినా జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక స్వాలంబన జరగేలేదంటే అక్కడివారి ఆలోచనా దృక్పధంలో దోషం ఉన్నదన్నమాట. ఉదాహరణకు హైకోర్టు విషయమే తీసుకుందాం. అది కర్నూలులో ఉన్నంత మాత్రాన ప్రత్యేకంగా రాయసీమ వాసులకు వనగూడే ప్రయోజనాలు ఏముంటాయి? మహా అయితే ఓ డజను మంది న్యాయమూర్తులు, వందమంది ఉద్యోగులు, రెండు మూడు వందల మంది లాయర్లుకు, గుమస్తాలకు పని వస్తుంది. కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంట్లో ఏడుస్తాడు అనే నానుడి తెలిసిందే. హైకోర్టు దగ్గరే ఉందికదా అని కింది కోర్టులో ఓడినవారు పంతాలకు పోయి కేసులు వదలక హైకోర్టు చుట్టూ తిరిగి ఇల్లు వళ్ళు గుల్లచేసుకుంటారు.
అలాగే హైకోర్టు కర్నూలు లో ఉంటే చిత్తూరు, హిందూపూరు, కడప వాళ్లకు కొత్తగా వరిగేది ఏముంది? దానికంటే రాయసీమలో అన్ని ప్రాంతాల వారికి కావాలినది త్రాగునీళ్లు ,సాగు నీళ్లు, ఉపాధి కల్పించే పరిశ్రమలు. వాటికొరకు గొంతులెత్తాలి. గుత్తాధిపత్యం రూపుమాపాలి.
రాయల సీమలో కూడా పెట్టుబడి దారులు, ధనవంతులు, వ్యాపారస్తులు, విద్యావంతులు తగినంత మంది ఉన్నారు. అక్కడి పెట్టుబడులు పెట్టి స్థానికంగా అభివృదికి తోడ్పాటు అందించాలి, కానీ వారా పని చేయుట లేదు. కారణం కక్షలు కార్పణ్యాలకు దూరంగా చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాలకు పోయి పరిశ్రమలు పెట్టి స్థిరపడ్డారు. ఈ స్థితిలో మార్పు తేగలిగితే అభివృద్ధి వస్తుంది. వాస్తవాలు ఇలాఉంటే రాజకీయ పెత్తనం చలాయించటానికి అనుక్షణం ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టి బ్లాక్ మెయిల్ రాజకీయం చేయటం అక్కడ పరిపాటి అయింది. ఇంచుమించు ఇదే తంతు 1937 లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం నాటి నుండి 80 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నాం. అలాగే కోస్తాఆంధ్ర ప్రాంతం నుండి రాష్ట్రానికి రెవిన్యూ మిగులు వస్తుంటే రాయసీమ మొదటినుండి రెవిన్యూ లోటుతో ఉందన్న సంగతి మదిలో ఉంచుకోవాలి. తెగేదాకా త్రాడు లాగటం విజ్ఞత కాదు.
తెలుగువారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కలసి ఉంటే కలదు సుఖం అని కోస్తా ఆంధ్రులు ఆలోచించారు. ఆనాడు ఉమ్మడి మద్రాసునుండి విడిపోయి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కానీ, భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణాతో కలిసి ఆంద్రప్రదేశ్ గా అవతరించినపుడు గాని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తొలినుండి సోదరభావంతో పెద్దఅన్నగా సీమ క్షేమానికి,అభివృద్ధికి శ్రాయశక్తులా తోడ్పడిన ప్రాంతంపై అకారణ ద్వేషం, అంతులేని శత్రుత్వం, విషం చిమ్ముతూ ఉద్యమాలు నడపటం, కష్టనష్టాలలో తోడుండిన తెలుగువారిని విశ్వసింప పోవటం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుంపట్లు రగిల్చి దానిలో చలి కాచుకోవటం సరైన మార్గం కాదు. దీనిపై రాయసీమ మేధావులు స్పందించాలి. రాయల సీమ అభివృద్ధికి ఈ ప్రాంత వాసులు ఎప్పుడు వెతిరేకం కాదు. నైతకంగా ఎటువంటి హక్కు లేకున్నా ఇక్కడ లభించే కృష్ణ గోదావరి జలాలను మానవత్వంతో సీమకు అందించే పథకాలకు స్వాగతిస్తున్నాం.
స్వయం జనిత ఆర్థిక ప్రణాళికతో పైసా పెట్టుబడి లేకుండా రెండు లక్షల కోట్ల సంపదను సమకూర్చే అమరావతి నిర్మాణంకు ఆక్షేపణ చెప్పేముందు కేవలం సీమకు నీళ్లు ఇవ్వటానికి లక్ష కోట్ల అప్పుతో ప్రణాళిక చేయటం ఎంత వరకు సబబో ఆలోచించాలి. పెట్టుబడికి, ఆదాయానికి పొంతన లేని పొల్లు మాటలతో కష్టాలు తీరిపోవు, కడుపులు నిండవు.
నవ్యఆంధ్ర లో అందరికి ఉపయోగపడే ప్రజా రాజధాని అమరావతి. కృష్ణ పెన్నా నదుల అనుసంధానానికి ఉపయోగపడే బహుళార్థక సాధకం పోలవరం ప్రాజెక్టు. మన ప్రాణ నాడి అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి ఒక్కరు కుల, మత,వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. వాటి ద్వారా పొందే ప్రతి ఫలాలూ ఇక్కడి వారితోపాటు రాష్ట్రమంతా పదికాలాలపాటు పొందుతారు. (సశేషం)
Comments