1.అమరావతి నగర ప్రణాళిక
అమరావతి రాజధానికి గా ఉండటానికి దానికి కున్న చారిత్రిక వైభవం మాత్రమే కాక ఇతర యోగ్యతలను పరిశీలిద్దాం. రాజధానికి అనువైన ప్రాంతం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో అందరు చర్చించే వాటిలో వాస్తు అనుకూలతలు ఒకటి. ఇక్కడ ఇంటికి సంభందించిన వాస్తు విషయాలను వదిలి రాజధానికి సంబంధించిన వాటినే ప్రస్తావిస్తాను.
వాస్తు ప్రస్తావనలు
"వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.
వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు. ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండలపై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని, అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే 'భూ దుర్గం' అని వర్గీకరించారు. వీటిలో శత్రు భయం లేని చోట భూ దుర్గాలు నిర్మించటం సర్వ శ్రేష్టం అని చెప్పబడింది.
రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండి రాకపోకలకు అనువుగా ఉండేలా రాజధానిని నిర్మించాలని, అది నివాస యోగ్యంగా ఉండాలని చెప్పారు. మహా భారతం లో శ్రీకృష్ణుడు పాండవుల కొరకు ఖాండవ వనాన్ని నిర్దాక్షణ్యంగా నిప్పు పెట్టి ఇంద్రప్రస్థం పేరుతో వన దుర్గాన్ని, తన కొరకు సముద్రంలో ద్వారక పేరుతో జల దుర్గాన్ని నిర్మించాడని చెప్పబడినది. అలాగే చరిత్ర పుటలు తిరగేస్తే బోలెడన్ని కొండలపై కట్టిన గిరి దుర్గాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో అమారావతి ప్రాంతంలో రాజధానులుగా వెలసిల్లిన కొండపల్లి కోట,కొండవీడు కోట ప్రసిధ్ధి చెందాయి.
చరిత్రలో నదీ తీరంలో వెలిసిన రాజధానులు ఎన్నో దర్శనం ఇస్తాయి. అలాగే నదికి ఉత్తర తీర దిశలో నిర్మించే నగరాన్ని 'సౌమ్యపురం' అని, దక్షిణ తీరం లో కట్టే వాటిని 'ధర్మ పురం' అని చెపుతూ నదికి ఇరు తీరాలలో నగరాలు నిర్మించ వచ్చునని చెప్పబడింది. నగరానికి ఉత్తర దిశలో మాత్రమే నీరు ఉండాలనే సిద్దాంతం కుడా తప్పే. భూ లభ్యతను బట్టి నగర నిర్మాణం నదికి ఎవడ్డునైనా నిర్మిచుకోవచ్చు. కృష్ణకు ఉత్తరాన నిర్మిస్తున్న మన అమరావతి సౌమ్య నగరం గా భాసిల్లుతోంది.
వాస్తు తో పాటు చరిత్రను కుడా పరిశీలిస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అర్ద శాస్త్రం రాసిన ఆచార్య చాణక్యుడు కూడా రాజధాని నగరం ఎక్కడ ,ఎలా ఉండాలో స్పష్టం గా చెప్పాడు. రాజధానిగా ఉండే ప్రదేశం దేశానికి మధ్య భాగంలో శ్రేష్టము మరియు సారవంతమైన భూమి అయి ఉండాలి. అది నాలుగు వర్ణాల వాళ్ళ జీవనానికి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రదేశం నదీసంగమం దగ్గర కానీ , ఎప్పటికి ఎండని జలాశయం వద్ద గాని (సహజ సిద్దమైనది లేదా మానవ నిర్మితం కాని ) ఉండాలి. దాన్ని నగర నిర్మాణ వేత్తలు మంచిదని చూచించినచో ఆప్రదేశంలో దేశస్థానీయాన్ని( మహా నగరాన్ని) నిర్మించాలి.
అది వాస్తువశం చే (ప్రదేశాన్ని బట్టి ) వృత్తాకారంలో కాని చతురస్రాకారం లో కాని దీర్ఘ చతురస్రాకారం (ఆయతాకారం) లో కాని ఉండవచ్చు అని చాణుక్యుడు సాదారణ సూత్రీకరణ చేస్తే మత్స్య పురాణం లో నదీతీరంలో నిర్మించే రాజధాని అర్ధ చంద్రాకారంలో ఉండటం ప్రశస్తం అంటుంది.
అలాగే అక్కడ ఉన్న భూమి దేవమాత్రుకం (వర్షాధార/మెట్ట భూమి ) కాకుండా నదీ మాత్రుకం (మాగాణి) గా ఉండాలి అని ,ఇంకా అది పలు పుష్ప, ఫలోఫేతమై కడు రమ్యంగా ఉండాలి. అచ్చట ఉన్న జనులు అనురక్తులుగా వారిలో అత్యధికులు వ్యవసాయం, వ్యాపారం చేసే కర్మకారులుగా (శ్రమజీవులు) ఉండాలి అని చెబుతుంది.
రాజాధాని నగరానికి కుడి వైపున జల ప్రవాహం ఉండాలి. అంటే తూర్పు దిశకు నగరం ఉంటె జలప్రవాహం దక్షణం లో ఉత్తరంగా ఉంటె తూర్పున, పడమర దిశ లో ఉంటె జలప్రవాహం ఉత్తరంలో, దక్షిణ దిశకు ఉంటె పడమర దిశలో ప్రవాహం ఉండాలి అని కౌటిల్లుని ఉవాచ.
ఇది తూర్పు,ఉత్తర దిశలలో మాత్రమే ప్రవాహం ఉండాలనే ఈనాటి కొత్త వాస్తు ప్రవక్తలకు మింగుడు పడని విషయం. అలాగే మురుగు నీరు పోయే మార్గం ఎడమ ప్రక్కన ఉండాలి.
పుర మధ్యలో దేవాలయాలు, విపణి వీధులు (వ్యాపార ప్రదేశాలు) తో పాటు వివిధ ప్రదేశాలలో వైద్యశాలలు, ధాన్యాగారాలు, ఉద్యానవనాలు, యంత్ర శాలలు (కర్మాగారాలు), అగ్ని శాలలు నిర్దేశించిన ప్రదేశాలలో ఉండాలి.
ఉత్తర లేక తూర్పు దిశలలో శ్మశాన ప్రదేశాలు ఏర్పాటు చేయాలి అని చెబుతూ శూద్రులకు, మిగతావారికి దక్షిణ దిశలో ఉండాలని శాసించాడు.
అయితే నివాసం గా ఏ ప్రదేశం శ్రేష్టం అనే విషయం గురించి 13 వ శతాబ్దికి చెందిన సుమతీ శతక కవి బద్దెన ఒక వాస్తవిక వాస్తు సూత్రం చెప్పాడు. అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు, ఎల్లప్పుడు ప్రవహించు నదియును, విద్యావంతులు గల ప్రాంతాలు నివస యోగ్యాలని చెప్పారు. ఈ లక్షణాలు నూతన రాజధానికి కుడా అవశ్యమే.
2.సుందర రాజధాని
ఉన్నంతలో ఈ లక్షణాలు విజయవాడకు మాత్రమే పుష్కలంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టగలిగే ఆర్దిక బలం గలవారు, నైపుణ్యం గల విద్యావంతులు, వైద్యులు , ఎల్లప్పుడూ పారే కృష్ణా నది తో నీటి వసతి తో పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టే ఇది నివాస ప్రదేశంగా ఆనాటి నుండి నేటివరకు విరాజిల్లుతున్నది.అందమైన ఈ అమరావతి ప్రాంతం నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది నడిబొడ్డు.రాష్ట్రం నలుమూలల నుండి రాకపోకలకు అనువైన ప్రదేశం. నదికి ఇరు ప్రక్కల నదీ ముఖ రాజధానిగా ఇది దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. శత్రు భయం లేని సురక్షిత ప్రదేశం మన అమరావతి. ఇక్కడే భావి తరాలు భవిషత్ ను దృష్టి లోనుంచుకొని సొగసైన, సౌకర్యవంతమైన, సుసంపమైన పచ్చని పర్యావరణ హితమైన సుందర రాజధానిని తెలుగు జాతి గర్వపడేలా, పరులు మెచ్చేలా గొప్పగా నిర్మించుకుందాం. ఈ బృహత్తర మహా నగర నిర్మాణంలో మనం సైతం ఉడతాభక్తిగా సహాయ సకారాలు అందించుదాం. తెలుగు తల్లికి వడ్డాణంగా కనక దుర్గమ్మ కనుచూపులతో మన అమరావతి శోభిల్లుతుందనుటలో సందేహం పడవలదు.
(సశేషం) ఆచార్య కొడాలి శ్రీనివాస్
Comments