ఈ దేశానికే వాస్తు సరిగా లేదని, అందుకే మనకిన్ని కష్టాలని ఓ వాస్తు విద్వాంసుడు (వి ద్వంసుడు) సెలవిస్తున్నాడు. మరొకడు రాష్ట్రానికి, ఇంకొకడు జిల్లాలకు, వేరొకడు ఊరికి వాస్తు బాగాలేదని అంటుంటే, ఇప్పుడు పార్టీ గెలుపు ఓటమిలకు కుడా వాస్తు పనిచేస్తుందని మాయ చేస్తున్నారు.
ఇలా గృహ వాస్తు రోజురోజుకి ముదిరి అనేక రంగాలలోకి దూరిపోతున్నది. దేశానికి అంటుకున్న ఈ వాస్తు తెగులుకు మందు వేయాలి, లేకుంటే జాతి నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇది ఇలాఉంటే ... ఆడలేని అమ్మ మద్దెల ఓడు అన్నట్లు, తెలుగు దేశం పార్టీ నేతలు రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవటానికి పార్టీ ఆఫీసు ఎన్.టి.ఆర్. భవన్ కు వాస్తు బాగా లేనందువల్లెనని తీర్మానించి వాస్తు మరమ్మత్తులు మొదలెట్టారు. ఇంతకు ముందు కుడా ఇలానే చాలా సార్లు పార్టీ కార్యాలయాలకు వాస్తు చికిత్సలు చేసి చేతులు కాల్చు కున్నా బుద్ది రాలేదు. అధికారంలోకి రావటానికి ప్రజలను నమ్ముకుంటే ఫలితం వుంటుందే గాని వాస్తును నమ్ముకుంటే పార్టీ నశించి పోవటంఖాయం.విజన్ 2020 అంటూ మొదలు పెట్టి మూఢ నమ్మకాలలో కాలక్షేపం చేయటం ఎంత వరకు సబబో పార్టీ శ్రేణులుకొంచం ఆలోచించాలి.
నిరాశ, నిస్పృహలు ప్రవేశించినప్పుడు వివేకం సన్నగిల్లటం సహజం.ఇలాంటి సమయంలోనే విజ్ఞతచూపాలి. ఈ నాటి దేశ రాజకీయాలలో అబద్రతా భావం పెచ్చు మీరి రాజకీయ నాయకులు వాస్తు, గ్రహ బలాలను పట్టుకు వ్రేలాడుతున్నారు. అధికారంలో ఉన్నవారైతే మరీను. ప్రభుత్వ ఆఫీసు లకు,క్వార్టర్స్ కు వాస్తు పేరుతొ రిపేర్లు చేస్తూ ప్రజా ధనం వృధా చేస్తున్నారు. వీరిని చూసి ఎందరో సామాన్య జనం కుడా వాస్తు దోషాల పేరుతో వారి కాలాన్ని,ధనాన్ని పోగొట్టుకుంటున్నారు.
ఒక లెక్క ప్రకారం వాస్తు పేరుతొ ఈ దేశంలో షుమారుగా ఏటా ఒక వెయ్యి కోట్లు రూపాయలు వృధా అవుతుందని అంచన. ఈ డబ్బుని ప్రజోప పనులకు ఉపయోగపడితే ఎంత బాగుండు. పదుగురికి మార్గనిర్దేశం చేసేవారు,ప్రజలలో పలుకుబడి/హోదా వుండేవారు,డబ్బు, డాబు వుండే పెద్దలు .. వీరు నడిచే పద్దతిని బట్టి, చేసే పనులను బట్టి ఇలాంటి చిల్లర,మల్లర వాస్తుపనులకు ఆదరణ లభిస్తున్నది.
అలాగే ఎలక్షన్లలో గెలవటానికి యజ్ఞాలు,యాగాలు చేసే ప్రభుద్దులు, ఇళ్ళకి వాస్తు,పనులకు ముహూర్తాలు,వర్జాలు చూచుకొనే ప్రజా నాయకులకు ఈ దేశంలో కొదవలేదు. దశా నిర్దేశం చేయాలిసిన మన నాయకులు "కుక్క తోకను పట్టుకొని .." దేశాన్ని నడిపిస్తాం అంటుంటే ..చేసేది ఏమి లేదని తల పట్టుకొని కుర్చోవాల, లేక వాళ్ళని కుర్చీలో నుండి దించాలా? వేమన అన్నట్లు 'బుద్ది చెప్పువాడు గుద్దితేనేమి' అని వారికి బుద్ధి రావటానికి మనమేం చేయాలో ఆలోచించండి !!!
Comments
వాస్తు బాగోలేదని ప్రభుత్వ భవనాలను మరమ్మత్తులు చేయించడానికి, లేదా కూలగొట్టి మళ్ళి కట్టడానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వ ఖజానా నుండి కేటాయించరాదని,అలా చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగ పరచడమే అవుతుందని ప్రజా సంఘాల నాయకులు శ్రీ ఇన్నయ్య గారి నాయకత్వంలో ది 13 జూన్,2009 న రాష్ట్ర ఆర్ధిక మంత్రి శ్రీ కే.రోశయ్య గారికి వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం పరిసిలించిన రోశయ్యగారు వాస్తుపేరుతో ప్రభుత్వ ధనం వృధాఅవుతున్న మాట నిజమేనని, ఇక పై అలా జరగకుండా అన్ని విభాగాలకు ఆదేశాలు జారి చేస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి గారి ఆదేశాలు ఎంత వరుకు అమలు జరుగుతాయో చూద్దాం.